కేకే రంగనాథాచార్యులుగారి మరణానికి సంతాపం

కేకే రంగనాథాచార్యులుగారి మరణానికి సంతాపం

          వేలాదిమంది విద్యార్థులకు తెలుగు భాష, సాహిత్యాలను శాస్త్రీయంగా బోధించిన, వందలాది పరిశోధకులకు మార్గదర్శకులుగా పనిచేసిన మార్క్సిస్టు సాహితీ విమర్శకులు ఆచార్య కోవెల్‌ కందాళై రంగనాథాచార్యులు (80) కోవిడ్‌తో 15-5-2021న హైదరాబాద్‌లోని తార్నాకలో మరణించారు. ఆయన 14-6-1941న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు.

          ఆయన విశ్లేషణాత్మక రచనలు, గంభీరమైన ప్రసంగాలు, చతురోక్తులతో సాగించే సంభాషణ… ఏదైనా… ఆలోచింపచేసేవిగా, విజ్ఞానదాయకంగా, వివేచన కలిగించేవిగా ఉండేవి. విప్లవ రచయితల సంఘం, జనసాహితి వ్యవస్థాపకులలో ఒక ముఖ్యుడైన జ్వాలాముఖి, కె.కె.ఆర్‌ హైదరాబాదులోని సీతారాం భాగ్‌ దేవాలయ ప్రాంగణంలో పెరిగారు. జ్వాలాముఖితో పాటు తాను దిగంబర కవులలో ఒకరు కాకపోయినా ఆయన వారితో బాగా సన్నిహితంగా వుండేవారు. మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంతో మాత్రమే సమాజాన్ని, చరిత్రను, సంస్కృతిని, తద్వారా సాహిత్యాన్ని అవగాహన చేసుకోగలుగుతామనే నిర్ధారణకు కేకేఆర్‌ కూడా వచ్చారు. కనుకనే 1970 జులై 4న విరసం ఆవిర్భావ ప్రకటన చేసిన 14 మందిలో వీరూ ఒకరిగా ఉన్నారు. ఆయన, ఊర్మిళగారూ కులాంతర వివాహం చేసుకున్నారు.

          ఆయన తెలుగు, సంస్కృతం, భాషాశాస్త్రాలలో 3 ఎం.ఏ. డిగ్రీలు పొందారు. ప్రాచీన తెలుగు శాసన భాషపై బద్రిరాజు కృష్ణమూర్తి పర్యవేక్షణలో పరిశోధన చేసి డాక్టరేట్‌ సాధించారు. సారస్వత పరిషత్తు ఓరియంటల్‌ కళాశాలలో 20 ఏళ్లకు పైగా ప్రిన్సిపల్‌గా ఉండి తన అపార సంస్కృత ఆంధ్ర భాషాపాండిత్య సంపదను విద్యార్థులకు పంచారు. 1987లో కేంద్రీయ విశ్వ విద్యాలయానికి ఆచార్యులుగా, తెలుగుశాఖ అధిపతిగా, డీన్‌ గా పని చేశారు. ఆయనను ఆచార్యులకే ఆచార్యుడు అని అంటే అతిశయోక్తి కాదు. ‘‘తెలుగు సాహిత్యం – మరోచూపు’’; ‘తెలుగులో తొలి సమాజ కవులు’; ‘తెలుగు సాహిత్య వికాసం’; ‘తొలినాటి తెలుగు కథానికలు’; ‘ఆధునిక తెలుగు సాహిత్యమూ – విభిన్న ధోరణులు’; ‘బహుముఖం’ (వ్యాస సంకలనం) వంటి అనేక రచనలు చేశారు.

          తెలుగు సాహిత్య విమర్శ, పరిశోధనలలో ప్రత్యేక ఒరవడి దిద్దిన కేకేఆర్‌, ఏది రాసినా అదొక ప్రామాణిక పత్రం లాగా ఉండేది. 1989 ‘ప్రజాసాహితి’లో ఆయన రాసిన సంస్కృతి అంటే… అనే వ్యాసం అనేక ముద్రణలకు నోచుకుంది. ఆయన రచనల సంకలనం అయిన ‘బహుముఖం’లోని వ్యాసాలన్నీ సాహిత్యకారులకు ఆకర పత్రాలు (Reference) లాంటివి.

          ఒక గొప్ప సాహితీవేత్తను మనం కోల్పోయాము. వారి లేని లోటు పూడ్చలేనిది. కేకేఆర్‌ మరణానికి జనసాహితి సంస్థ ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తోంది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తోంది.

admin

leave a comment

Create Account



Log In Your Account