అంతరాలులేని, అంధవిశ్వాసాలు లేని సమాజం కోసం కృషిచేసిన దొడ్డా హరిబాబు మాష్టారు తన 65వ ఏట 3 మే 2020న తెనాలిలో మరణించారు. ఆయన ప్రకాశంజిల్లా యద్ధనపూడి మండలం మున్నంగివారిపాలెంలో 1953లో జన్మించారు.
హరిబాబు మాష్టారు చిన్నప్పటి నుండి అభ్యుదయ భావాలతో వుండేవారు. ఊరిలో యువజన గ్రంథాలయాన్ని నిర్వహించేవారు. భాషాప్రవీణ చదవటం కోసం తాడికొండ సంస్కృత కళాశాలలో చేరటంతో చార్వాక రామకృష్ణగారి శిష్యుడయ్యారు. బాబాల, స్వాముల, అమ్మవార్ల బండారాలను బట్టబయలు చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాశంజిల్లాలో అనేక నాస్తిక హేతువాద కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన ఆదర్శ వివాహమే చేసుకున్నారు. ఆయన పిల్లలకు కుల వ్యతిరేక వివాహాలే నిర్వహించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా, రైతాంగ సమస్యల మీద, మూఢ మత సంప్రదాయాలను ప్రశ్నిస్తూ మూడు దశాబ్ధాలకు పైగా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన ఉపాధ్యాయుడిగా, జర్నలిస్టుగానూ ఉత్తమ విలువలతో ఆదర్శవంతమైన పాత్రను పోషించారు. ‘ప్రజాసాహితి’ పాఠకుడు, అభిమాని అయిన హరిబాబు మాష్టారుకు సంతాపం తెలియచేస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నాం.