లౌకిక, ప్రజాతంత్ర వైజ్ఞానిక ప్రగతిని అవహేళన చేస్తున్న కుహనా శాస్త్రజ్ఞులు

లౌకిక, ప్రజాతంత్ర వైజ్ఞానిక ప్రగతిని అవహేళన చేస్తున్న కుహనా శాస్త్రజ్ఞులు

సామాజిక చలనక్రమంలో సంస్కృతి నిర్మాతలు ముగ్గురే. శాస్త్రవేత్త – కళాకారుడు – శ్రామికుడు. నూతన సృజనకు ఆలోచన చేసేవాడు శాస్త్రవేత్త. ఆ ఆలోచనను అందంగా, ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా ప్రచారంలో పెట్టేవాడు కళాకారుడు. దాన్ని భౌతిక ఆచరణశక్తితో వాస్తవిక ప్రపంచంలోకి నేల మీదకి దించి రూపకల్పన చేసి చూపించేవాడు శ్రామికుడు. ప్రకృతితో ఐక్యత – సంఘర్షణల ఫలితంగా అందివచ్చిన విజ్ఞాన సంపదను శ్రామికుల నుండి శ్రామికులకు అనే గతితార్కిక క్రమమే సామాజిక వికాసం. ఈ మౌలిక సామాజిక అవగాహనలోంచి పరిశీలిస్తే సైన్స్‌ కాంగ్రెస్‌ పోకడలను ప్రజాదృక్పథంతో అవగాహన చేసుకోవచ్చు. 2019 జనవరి 3 – 7 తేదీలో 106వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదీ జరిగింది. పంజాబ్‌లో లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (జలంధర్‌) వేదికగా జరిగిన ఈ సైన్స్‌ కాంగ్రెస్‌ “భవిష్యత్‌ భారత్‌లో విజ్ఞాన శాస్త్రమూ, సాంకేతికత” అనే ప్రధాన అంశంగా జరిగింది. వర్తమాన సామాజిక ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా నిలబడగలిగి నిరంతరం పురోగమించే పారిశ్రామిక అవసరాల కోసం సైన్స్‌ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. భారతదేశంలో వైజ్ఞానిక రంగంలో ఇంతవరకు ఏం జరిగింది, ఇప్పుడు వర్తమానంలో ఏం చేయగలం, భవిష్యత్‌ శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని ఎలా నిర్వహించుకుందాం అనే లక్ష్యాలతో సైన్స్‌ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఈ సమావేశాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉప కులపతి జి.నాగేశ్వరరావు పరమ అశాస్త్రీయమైన ప్రకటనలు చేశారు. రామాయణ కాలంలో రావణాసురుడు 24 రకాల విమానాలు వాడారనీ, ఆ విమానాల కోసం విమానాశ్రయాలను కూడా నిర్వహించారనీ, భారతంలో వందమంది కౌరవులు పుట్టడం వెనుక మూలకణాల వైద్య సాంకేతికత ఇమిడి ఉందని అన్నారు. టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సాంకేతికత ఆ రోజుల్లోనే భారతదేశం సంతరించుకుందని చెప్పారు! కరుడుగట్టిన గతవాద పునరుద్ధరణ భావజాలంతో ఛాందస భావాలకు పట్టంకట్టి, సామాజిక బాధ్యతతో కూడిన స్వేచ్ఛాయుత భౌతికవాద వైజ్ఞానిక వికాసాన్ని అవహేళన చేసే విధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రసంగం సాగింది. ఆరుగురు నోబెల్‌ బహుమతి పొందిన ప్రపంచ శాస్త్రవేత్తలు ఆ సమావేశానికి హాజరయ్యారు. జర్మనీ, ఇంగ్లాండ్‌, హంగేరి మొదలైన అనేక దేశాల నుండి 30 వేలమంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు వచ్చారు అక్కడికి. డి.ఆర్‌.డి.వో; ఇస్రో, భారత శాస్త్ర సాంకేతికశాఖ, ఏ.ఐ.ఐ.ఎం.ఎస్‌; యూజీసీ, ఏ.ఐ.సి.టి.ఎఫ్‌, జె.సి.బి.ఎఫ్‌ మొదలైన భారత వైజ్ఞానికరంగాల నుండి ఎందరో వైజ్ఞానిక మేధావులు హాజరైన ప్రతిష్టాత్మక జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ మహాసభ అది. అటువంటి వైజ్ఞానిక మేధావులు హాజరైన సైన్స్‌ కాంగ్రెస్‌ మహాసభల్లో మురిగిపోయిన మతఛాందస భావజాలాన్ని యువ శాస్త్రవేత్తల నెత్తిమీద రుద్దడానికి గత ఐదేళ్ళుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. కాల్పనిక సాహిత్యంలోని కవి సమయాలకు – కవితాత్మక ప్రతీకలకు – ఊహాజనిత ఫాంటసీ చిత్రీకరణలకు, వైజ్ఞానిక విలువల్ని ఆపాదించడానికి, అశాస్త్రీయ భావజాలాన్ని గుమ్మరించడానికి సైన్స్‌ కాంగ్రెసు సభలను బలివేదికగా వాడుకున్నారు. ఇది నవీన విశ్వవిద్యాలయంలో పురాణ కాలక్షేపం. ప్రశ్నిస్తే మండిపడి దురంతమై రగిలే మత భావజాలం, బానిస భావాల్ని పెంచి పోషించడం చరిత్ర పొడవునా మనం ఎరిగినదే. మనిషి అస్పష్టతలోంచి, భయంలోంచి, తెలిసీ తెలియనితనం నుంచి ప్రకృతి పట్ల కృతజ్ఞత నుంచి, చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచపు గతి సూత్రాలను అర్థం చేసుకోలేని పరిస్థితుల నుంచి పుట్టిన మత ఛాందస భావాలకు పెద్ద పీట వేయడం ద్వారా నేటి 21వ శతాబ్దపు విద్యార్థి యువతరాన్ని గతవాదానికి బలిచేయడానికే సైన్స్‌ కాంగ్రెస్‌ను వీరు వాడుకుంటున్నారు. మిగులు సంపదలు పోగుపడిన దగ్గర నుండి, సామాజిక నిర్వహణ కోసం రాజ్యం ఊపిరి పోసుకున్న దగ్గరనుండి, పాలకులు, పురోహితవర్గం ప్రజల అజ్ఞానంతో, ప్రజల బలహీనతలతో తమ రాజ్య బలాన్ని కాపాడుకుంటూ వస్తున్న పరిస్థితులను మనం వాస్తవిక చారిత్రక అధ్యయనం ద్వారా అవగాహన చేసుకుంటున్నాం. ప్రకృతిని, మానవ శరీర నిర్మాణాన్ని, జీవప్రపంచాన్ని లోతుగా అధ్యయనం చేసే జిజ్ఞాస ఉన్న తొలినాటి వైజ్ఞానిక ఆలోచనా పరులను రాజ్యం, మతం మిలాఖతై పురోగామి భావజాలాన్ని, హేతుబద్ధ ఆలోచనావిధానాన్ని కలిగి ఉన్న వాళ్లను మూర్ఖంగా తుదముట్టించిన సందర్భాలు నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే వున్నాయి. రాజ్యం అవసరాల మేరకు వైజ్ఞానిక అభివృద్ధిని దోపిడీ చట్రానికి కుదించి ఉంచడానికి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అణచి ఉంచే విధానాలు ఎప్పుటికప్పుడు తలెత్తుతూనే ఉన్నాయి. ప్రజాతంత్ర ప్రగతిశీల పురోగామి భావజాలాన్ని బలపరిచే వ్యక్తులను శక్తులను వెంటాడి, వేటాడి పదవీ వ్యాపార రాజకీయాలకు మతతత్వ భావాలను ఎరువుగా పోసే విధానాలు, పోకడలు ఇటీవల గత నాలుగు సంవత్సరాలుగా హద్దూ పద్దూ లేకుండా బరితెగించి పోతున్నాయి. దేశంలో ప్రజాస్వామ్యం, కనీసంగా భావప్రకటన స్వేచ్ఛ, ఇంకా చెప్పుకోవాంటే బతికే హక్కు ప్రశ్నార్థకమైంది. ఈ క్రమంలోనే స్వయంగా లౌకిక ప్రజాస్వామ్య విలువల మీద ప్రమాణం చేసి వచ్చిన ప్రభుత్వమే సమాధులు తవ్వి, యోగా పేరిట మతమౌఢ్యాన్ని బుర్రల్లో కుక్కుతోంది. పుష్కరాల పేరుతో ప్రజాధనాన్ని వినియోగించి స్వర్గానికి నిచ్చెనలు వేస్తున్నట్లుగా భంగిమలు ఇచ్చి స్వయంగా ముఖ్యమంత్రులే నదులలో మునకలు వేసి, యాగాలు చేసి వ్యూహాత్మకంగా ప్రజల్ని నట్టేటిలో ముంచేస్తున్నారు. పదవులకోసం రాజ్యాంగయంత్రంలోని ఎన్నికల వ్యవస్థను అడ్డుపెట్టుకుంటూనే, ప్రజల సమస్యలకు పరిష్కారాలను పుష్కరాలలో, యజ్ఞయాగాదులలో, మూఢనమ్మకాలలో వెతుక్కోమని అడ్డదారులు చూపిస్తున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన ఈ ప్రజాప్రతినిధులు రాజ్యాంగంలోని వైజ్ఞానికస్ఫూర్తికి సంబంధించిన ఆచరణను నిలువునా పాతర వేస్తున్నారు. ఒకపక్క వైజ్ఞానిక ఆవిష్కరణల ప్రయోజనాలను మనం విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నాం. శాస్త్రీయ ఆలోచనల ఫలితాలను నిస్సందేహంగా అందుకొని అత్యాధునికంగా జీవితాన్ని మలుచుకుంటున్నాం. అనారోగ్యం అయితే ఆసుపత్రికి వెళ్లకుండా, కోవెలకు వెళ్లేవాళ్లు ఎంతమంది ఉన్నారు? దేనిదారి దానిదే. ప్రాణం మీదకు వస్తే వైజ్ఞానిక ప్రగతినే ప్రతి ఒక్కరూ ఆశ్రయిస్తారు. వైజ్ఞానిక శాస్త్రంలో ఉన్న నిరంతర పరిణామశీలత ఏదీ పరిపూర్ణం కాదని స్పష్టంగా చెబుతుంది. అందుకే వైజ్ఞానిక చింతన నిరంతరం మారుతూ ఉంటుంది. మెరుగవుతూ ఉంటుంది. ఉన్నతీకరించబడుతూ ఉంటుంది. కానీ కరుడుగట్టిన మతభావాలు మార్పును అంగీకరించవు. మాటలలో మత భావాలకు మద్దతు పలికినా, ప్రాణాల మీదకు వస్తే వైజ్ఞానిక వైద్యసదుపాయాలన్నింటినీ వినియోగించుకోవడానికి, లేదా ప్రమాదాల నుంచి గట్టెక్కడానికి శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని అంతటినీ నిస్సిగ్గుగా నిస్సందేహంగా ఈ మతవాదులు వినియోగించుకుంటారు. ఈ ద్వంద్వ ప్రవృత్తిని రకరకాల కర్మ, తలరాత అని కర్మయోగాన్ని బోధిస్తారు. ”కర్మణ్యేవాధికారస్తే” అని కష్టపడినవాడికి ఫలితాలు ఆశించే హక్కు లేదని దోపిడి సిద్ధాంతకారులు శ్రమజీవులను తరతరాలుగా వంచన చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా వాస్తవికవాదులు, సామాజిక దృక్పథం ఉన్నవాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రకృతి పరిణామానికి, సమాజ పరిణామానికి మధ్య ఉన్న సమన్వయ శక్తి – మానవుని శ్రమశక్తి గురించి. డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని ఈరోజు తప్పుల తడక అని కొత్త వాదాన్ని తీసుకొస్తున్నారు. న్యూటన్‌ గమన సూత్రాలు సరైనవి కావని చెప్పుకొస్తున్నారు. ఐన్‌స్టీన్‌ సూత్రాలు తప్పుల తడకలంటున్నారు. కానీ, వైద్యసాంకేతికతారంగంలో, యాంత్రిక ప్రపంచ సాంకేతిక అభివృద్ధిలో, ఈ సూత్రాలను రద్దు చేయగలరా!! ప్రజాసంస్కృతిని నిలబెట్టే సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, సాంస్కృతిక సిద్ధాంతాలేవో – ప్రజావ్యతిరేకశక్తుల ధోరణుల వెనక బుసలు కొడుతున్న సిద్ధాంతాలు ఏవో, నిలబడేవి ఏవో, నిలబడనివి ఏవో? చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసంలో చూసుకోవాల్సిన విలువలు ఏమిటో, వదులుకోవాల్సిన విలువలేమిటో ప్రజల ఆచరణ నిగ్గు తేలుస్తుంది. పరాధీన ఆర్థిక విధానాలతో, పదవీ వ్యాపార ధనస్వామ్య రాజకీయాలతో వైజ్ఞానిక ప్రగతిని కూడా భ్రష్టు పట్టించడానికి నేటి 70 ఏళ్ల స్వతంత్ర పాలకవర్గం వెనుకాడటం లేదు. వైద్యరంగాన్ని, సాంకేతికరంగాన్ని, విద్యారంగాన్ని, ఆఖరికి దేశ రక్షణ కోసం నిర్దేశించిన సైనిక రక్షణ రంగాన్ని కూడా స్వార్థపర శక్తులకు తాకట్టు పెట్టడానికి, గంపగుత్తగా అమ్మకానికి పెట్టడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. పాలకవర్గాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు ప్రతిఘటించకుండా, చైతన్యరాహిత్యంలో కొట్టుమిట్టాడేటట్లు మతభావజాలాన్ని మత్తు మందుగా ఉపయోగిస్తున్నారు. విద్యావైజ్ఞానిక రంగాలలో జ్ఞానం సామాజికచైతన్యంగా, భౌతికశక్తిగా మారకుండా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో ఒక భాగమే నేటి సైన్స్‌ కాంగ్రెస్‌లో పుక్కిటి పురాణ కాలక్షేపం. ప్రజాతంత్రశక్తులు, కష్టజీవులు, ఉపాధ్యాయ, విద్యార్థి యువతరం, ప్రజాతంత్ర మేధావులు, మహిళలు, సాహిత్య సాంస్కృతికరంగాలలో ప్రజారచయితలు, కళాకారులు నడుంకట్టి ఈ కుహనా వైజ్ఞానిక, తిరోగమన పోకడల్ని తిప్పికొట్టడానికి సంఘటితంగా నిలబడడమే తక్షణ కర్తవ్యం.

admin

leave a comment

Create Account



Log In Your Account